మాంజాతో మెడకు తీవ్ర గాయం
హైదరాబాద్ : గతంలో పలువురు ద్విచక్రవాహనదారుల ప్రాణాలు తీసిన మాంజా, తాజాగా మరో బైకర్ ప్రాణాల మీదకు తెచ్చింది. మెడ లోతుగా కోసుకుపోవడంతో బాధితుడికి కామినేని ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఆస్పత్రి వైద్యులు వివరాలు వెల్లడించారు. గుర్రంగూడకు చెందిన కార్తీక్ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇటీవల ఆయన కాబోయే భార్యతో కలిసి బైక్ మీద నాగోలు వైపు బయలుదేరారు. ఉన్నట్టుండి మెడకు ఏదో బిగుసుకున్నట్లు అనిపించడంతో ఆయన, హెల్మెట్లోంచే కుత్తిక వద్ద చేయిపెట్టి చూసుకుంటే తడిగా తగిలింది. రక్తం ధారగా వస్తుండటంతో కంగారుపడి బైక్ ఆపాడు. మెడకు మాంజా చుట్టుకోవడంతో బాధితుడి మెడ కండరాలు, రక్తనాళాలు తెగిపోయాయి. దారిన వెళుతున్న ఓ డాక్టర్ తన బైక్ను ఆపి.. ఆయన పరిస్థితిని చూసి వెంటనే కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కార్తీక్కు ఆపరేషన్ నిర్వహించి తెగిపోయిన రక్తనాళాలను అతికించి, కండరాలకు కుట్లు వేశామని కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ రిషిత్ బత్తిని చెప్పారు.









Comments