ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి
ఖమ్మం జిల్లా : ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల వరకే రాజకీయాలని.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజలకు మంచి చేసే ప్రజా ప్రతినిధులేనని పేర్కొన్నారు. మంచి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈరోజు (గురువారం) ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక శిక్షణా కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఆ బాధ్యత మనపై ఉంది..
తమ ప్రభుత్వం 6 తేదీ నుంచి 99 రోజుల పాటు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక రూపొందించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సర్పంచ్గా ఆ వ్యక్తి ఉంటే గ్రామం అభివృద్ధి జరిగిందని చెప్పుకునేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. అధికారులు కలెక్టర్, పోలీస్ కమిషనర్లు వారు ఉన్నప్పుడు మంచి పనులు జరిగాయని ప్రజలు చెప్పుకోవాలన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత, ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత మనపై ఉందని చెప్పుకొచ్చారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నిధులు వచ్చిన దాఖలాలు లేవని తెలిపారు. మార్చి 31వ తేదీ లోపు అభివృద్ధి పనుల కోసం నిధులు మళ్లీ వస్తాయని.. వచ్చిన నిధులను ప్రణాళికబద్ధంగా, ప్రజలకు ఉపయోగపడేలాగా వినియోగించాలని మార్గనిర్దేశం చేశారు.








Comments