• Aug 25, 2026
  • NPN Log

    ఆర్థిక ఆంక్షలను అమెరికా మరింత విస్తరించిన నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా కొత్త ఆంక్షలను ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే ప్రకటించారు. తమపై ఆర్థిక దాడి జరిగితే తాము కూడా ప్రతిదాడికి దిగుతామని హెచ్చరించారు. అమెరికా ఆంక్షలను 'ఆర్థిక ఉగ్ర దాడి'గా మదానిజాదే అభివర్ణించారు.

    అమెరికా ఆర్థిక ఆంక్షలకు ప్రతిస్పందించేందుకు తమ వద్ద కూడా అవసరమైన మార్గాలు, సాధనాలు ఉన్నాయని మదానిజాదే చెప్పారు. 'మా రక్షణ ఇకపై పూర్తిగా రక్షణాత్మకంగా ఉండదు. శత్రువులు దాడి కోసం ఎదురుచూడాలి' అని ఆయన హెచ్చరికలు చేశారు. అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు తమ వద్ద రెండు సంవత్సరాల ప్లాన్ సిద్ధంగా ఉందన్నారు. మరో పరాజయానికి అమెరికా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అమెరికా తాజా చర్యలను చైనా, రష్యా అంగీకరించలేదని కూడా ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలు విధిస్తే.. గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా ఆపేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది.

     

    అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఆగస్టు 24న ఇరాన్‌పై కొత్త ఆంక్షలను ప్రకటించారు. మొత్తం 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆర్థిక ఆంక్షలు విధించారు. ఇరాన్‌కు ఉన్న ఆర్థిక మార్గాలను మరింత కట్టడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలు కూడా భవిష్యత్తులో అమెరికా ఆంక్షలకు గురయ్యే అవకాశం ఉందని వాషింగ్టన్ హెచ్చరించింది. అయితే ఇరాన్ చమురు వాణిజ్యానికి సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్న కొన్ని కీలక చైనా ఆర్థిక సంస్థలను తాజా జాబితాలో చేర్చకపోవడం గమనార్హం.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement