రూ.1.7కోట్లు హాంఫట్
హైదరాబాద్ : డిజిటల్ అరెస్టు పేరుతో వృద్ధుడిని భయపెట్టిన సైబర్ క్రిమినల్స్ రూ.1.07 కోట్లు కొల్లగొట్టారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీకి చెందిన ప్రధాన సైబర్ నేరస్థుడు గురుదీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్ను అరెస్టు చేశారు. డీసీపీ అరవింద్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది అక్టోబర్లో నగరానికి చెందిన 62 ఏళ్ల వృద్ధునికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులమని నమ్మించారు.
బాధితుడి ఆధార్ కార్డు అక్రమ కార్యకలాపాలకు వినియోగించారని, మనీ లాండరింగ్ కేసులో డిజిటల్ అరెస్టు చేస్తున్నామని బెదిరించారు. భయపడిపోయిన బాధితుడిని వీడియో కాల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే ఆర్బీఐకి చెందిన ఖాతాలో మీ బ్యాంకుల్లో ఉన్న నగదు డిపాజిట్ చేయాలన్నారు. ఆడిట్ నిర్వహించిన తర్వాత మనీ ల్యాండరింగ్లో తమ ప్రమేయం లేదని తేలితే తిరిగి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని నమ్మించారు. అలా విడతల వారీగా సుమారు రూ. 1.07 కోట్లు కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు అక్టోబరు-15న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరించిన పోలీసులు నిందితుల కోసం గాలించగా సైబర్ ముఠాలో ప్రధాన నిందితుడు గురుదీప్ సింగ్ పోలీసులకు చిక్కాడు. ఢిల్లీలో ట్రావెల్ బిజినెస్, మనీ ఎక్స్ఛేంజ్ వ్యాపారం నిర్వహించే గురుదీప్ తన సహచరులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డాడు. అమాయకుల పేరుతో కరెంట్ బ్యాంక్ ఖాతాలను సేకరిస్తుంచి, బాధితుల నుండి కొల్లగొట్టే డబ్బును ఈ ఖాతాల్లోకి మళ్లిస్తాడు. ఆ తర్వాత సైబర్ ముఠాలో మరికొంతమంది ప్రధాన నిందితులకు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే దీపక్ గెహ్లావత్, ప్రశాంత్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా గురదీ్పసింగ్ను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు.










Comments