తగ్గిన ఉల్లిధర..
హైదరాబాద్: ఉల్లిగడ్డ ధర భారీగా తగ్గింది. మలక్పేట వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటా ధర రూ.1,100 పలికింది. రెండు నెలల నుంచి మార్కెట్లో క్వింటా రూ.1400 ఉండగా, నాలుగు రోజుల నుంచి ధర తగ్గుతూ వస్తోంది. మార్కెట్కు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా ఉల్లి వస్తుంది. గడ్డ పెద్దగా ఉండడంతో ఆ ఉల్లికి ధర ఎక్కువ పలుకుతుంది. మహారాష్డ్ర ఉల్లి క్వింటా గరిష్ట ధర రూ.1100 పలుకగా, మహబూబ్నగర్ నుంచి వచ్చిన ఉల్లి క్వింటా గరిష్ఠ ధర రూ.800 మాత్రమే పలుకుతుంది. మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన ఉల్లి కూడా ఇదే రేటు పలుకుతోంది.
ఉల్లి ధర తగ్గుతుండడంతో మార్కెట్కు పంట తెచ్చిన రైతులు నిరాశ చెందుతున్నారు. గతేడాది ఏప్రిల్ నెలలో క్వింటా రూ.1800కు అమ్ముడు పోయింది. గ్యాస్ కొరత కారణంగా చాలా హోటళ్లు మూసివేస్తున్నారు. దీంతో ఉల్లిగడ్డ వినియోగం చాలా వరకు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు నిలిచి పోవడం, వినియోగం తగ్గడంతో ఉల్లి నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో ధర తగ్గతూ వస్తుందని, యుద్ధం ఇలానే కొనసాగితే ధర ఇంకా తగ్గవచ్చని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.







Comments