బైబ్యాక్, ప్రీ లాంచ్ ప్లాట్ల పేరుతో మోసం
హైదరాబాద్ : అధిక లాభాలు, హామీతో కూడిన బైబ్యాక్, ప్రీ-లాంచ్ ప్లాట్ల పేరుతో పెట్టుబడిదారుల నుంచి కోట్ల రూపాయలు సేకరించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమూహ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై సైబరాబాద్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. కంపెనీ మేనేజింగ్ పార్టనర్ మల్లికార్జున్ కుర్ర, డైరెక్టర్లు అనిత నేనా, అనురూప కుర్రతో పాటు మరికొందరిపై భారతీయ న్యాయ సంహిత, తెలంగాణ డిపాజిటర్ల ఆర్థిక సంస్థల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సమూహ ప్రాజెక్ట్స్ ప్రతినిధి సంకు వెంకటేశ్వరరావు తమను సంప్రదించి యాచారం మండలం నందివనపర్తిలోని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే గడువు పూర్తయిన తరువాత కంపెనీ యాజమాన్యం మాట తప్పిందని ఆరోపించారు. తమకు భద్రతగా ఇచ్చిన చెక్కులు బ్యాంకుల్లో డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా తమ నుంచి సుమారు రూ.3.17 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆరోపించారు. ఇందులో నందకుమార్ మురారి నుంచి రూ.1.62 కోట్లు, సి.వెంకటేశం నుంచి రూ.50 లక్షలు, రాజేష్ మొహరాణా నుంచి రూ.15 లక్షలు, శ్రీనివాస్ రెడ్డి బండెల్ల నుంచి రూ.90 లక్షలు వసూలు చేశారు. మరికొందరు బాధితులు కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈవోడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.









Comments