బెంగాల్లో 4,000 ఈవీఎంలు దగ్ధం
కోల్కతా : పశ్చిమబెంగాల్లోని ఓ ప్రభుత్వ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 4,000 ఈవీఎంలు దగ్ధమయ్యాయి. కోల్కతాలోని అలీపూర్ ప్రాంతంలో ఉన్న తొమ్మిది అంతస్తుల భవనంలో బుధవారం మంటలు చెలరేగాయి. దక్షిణ 24 పరగణాల జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ విభాగాలు ఈ భవనంలో కొనసాగుతున్నాయి. దగ్ధమైన ఈవీఎంలన్నీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన యంత్రాలే. టీఎంసీ కంచుకోట దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 10 నియోజకవర్గాలకు చెందినవిగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లా పరిధిలోని మొత్తం 31 స్థానాల్లో టీఎంసీ 21 చోట్ల విజయం సాధించగా, బీజేపీ 10 స్థానాల్లో గెలిచింది. జిల్లా యంత్రాంగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపడానికి శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ప్రమాదమా.. ?.. కుట్రా.. ?
ఎన్నికల ఫలితాలకు ముందు ఈవీఎంల భద్రతపై, వాటిలో ట్యాంపరింగ్ జరిగిందంటూ తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆందోళనలు నిర్వహించింది. అయితే, ఇప్పుడు ఎన్నికలు ముగిసి స్పష్టమైన ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేయడం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. అగ్ని ప్రమాద విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి కౌశిక్ చౌదరీ గురువారం ధ్రువీకరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి కౌశిక్ చౌదరీ మాట్లాడుతూ.. ‘‘ఇది సాధారణ అగ్ని ప్రమాదంలా అనిపించడం లేదు. మంటలు వ్యాపించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మొదట రెండు, మూడు అంతస్తుల్లో మంటలు కనిపించాయి. మధ్యలో ఉన్న అంతస్తులకు ఏమీ కాకుండానే.. నేరుగా తొమ్మిది, పదో అంతస్తులకు మంటలు విస్తరించాయి. కుట్ర కోణం దాగి ఉందేమో పరిశీలిస్తున్నాం’’ అని ప్రకటించడం గమనార్హం. ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే పూర్తి విషయాలు తెలుస్తాయని మంత్రి స్పష్టం చేశారు.










Comments