బిల్ కట్టలేదని ఏకంగా టవర్నే లేపేశారు.. టెక్నీషియన్ వచ్చి చూస్తే షాక్..
సాధారణంగా దొంగలు ఏం చేస్తారు.. నగదు, బంగారం, వాహనాలు లేదా విలువైన వస్తువులను దొంగతనం చేస్తూ ఉంటారు. కానీ బిహార్లో జరిగిన ఓ విచిత్ర ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏకంగా 132 అడుగుల ఎత్తైన మొబైల్ టవర్, దానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన జనరేటర్ ఒక్కసారిగా కనిపించకుండా పోవడం స్థానికంగా సంచలనంగా మారింది. భారీ నిర్మాణాన్ని ఎలాంటి ఆనవాళ్లు లేకుండా ఎత్తుకెళ్లడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్న ప్రస్తుతం అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వెనుక ఎవరున్నారు? అసలు టవర్ ఎలా మాయమైంది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బిహార్లోని బక్సర్ జిల్లాకు సమీపంలోని దుమ్రావ్ పట్టణంలో 2010లో ఓ ప్రైవేటు టెలికాం సంస్థ ఈ మొబైల్ టవర్ ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం స్థలం యజమాని హరేనాథ్ యాదవ్తో 12 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2022లో ఒప్పందం ముగిసిన తర్వాత కంపెనీ నుంచి అద్దె చెల్లింపులు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో స్థలం యజమాని పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ కంపెనీ నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది.
ఇటీవల మరమ్మతుల కోసం అక్కడికి వెళ్లిన కంపెనీ ప్రతినిధులు టవర్తో పాటు జనరేటర్ కూడా కనిపించకపోవడంతో షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల కథనం ప్రకారం, టవర్ చాలా ఏళ్లుగా అక్కడే ఉండేదని, గత 15 నుంచి 20 రోజులుగా మాత్రమే కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని, అవసరమైతే స్థలం యజమానిని కూడా ప్రశ్నిస్తామని పోలీసులు వెల్లడించారు.








Comments