• Jun 13, 2026
  • NPN Log

    హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలోనే సింగరేణి మెడికల్ బోర్డును యథావిధిగా ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. మెడికల్ బోర్డును పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ బోర్డులో అక్రమాలు, మధ్యవర్తిత్వానికి తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రేపు(శనివారం) మంచిర్యాలలో 335 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

    సింగరేణిలో మారుపేర్ల సమస్య పరిష్కారానికి న్యాయ నిపుణుల సలహాలతో ముందుకు సాగుతున్నామని భట్టి చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిలో మొత్తం 2,657 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ఇందులో 2,102 కారుణ్య నియామకాలు, 555 ప్రత్యక్ష ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. కారుణ్య నియామకాల కోసం వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచినట్లు వెల్లడించారు. 40 వేల మంది సింగరేణి ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఉద్యోగుల కోసం రూ.10 లక్షల ఉచిత సహజ మరణ బీమా అమలు చేస్తున్నామని వెల్లడించారు.

    కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల ప్రమాద బీమాతో పాటు బోనస్ చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు. గత రెండేళ్లలో సింగరేణి కార్మికులకు రూ.1,500 కోట్ల లాభాల వాటాను పంపిణీ చేసినట్లు తెలిపారు. సింగరేణి ఆస్పత్రులను ఆధునికీకరిస్తున్నామని, గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త బొగ్గు బ్లాకులను సాధించి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement