అంపైర్లు మరింత నిశితంగా గమనించాల్సింది.. క్యాచ్ ఔట్ వివాదంపై భువీ రియాక్షన్
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఔటైన తీరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రజత్ కొట్టిన భారీ షాట్ను.. బౌండరీ లైన్ వద్ద జీటీ ఫీల్డర్ జాసన్ హోల్డర్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. అయితే బంతి నేలకు తాకిందని కోహ్లీతో పాటు ఆర్సీబీ ప్లేయర్లు అంపైర్లతో వాదించారు. కానీ థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించడంతో రజత్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్పందించాడు.
‘ఆ సమయంలో నేను అక్కడ లేను. కానీ ఆ తర్వాత రీప్లేలో చూసినదానిని బట్టి బంతి నేలకు తగిలినట్లే అనిపించింది. అంపైర్ ఆ సమయంలో ఏం చెప్పారో తెలియదు. ఆ క్యాచ్ ఆట నియమాలకు లోబడి ఉందో, లేదో తెలియదు. కానీ ఇప్పటికీ మా స్టాండ్కు కట్టుబడి ఉన్నాం. ఈ క్యాచ్ విషయంలో అంపైర్లు మరింత నిశితంగా గమనించి నిర్ణయం వెల్లడిస్తే బాగుండేది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో మా బ్యాటర్లు సరిగా ఆడలేదనడం కంటే మాకు కలిసి రాలేదని చెప్పొచ్చు. మేం టాస్ ఓడిపోయాం. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. విజయం కోసం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు శ్రమించాయి. కానీ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. సుదీర్ఘమైన టోర్నీలో 14 లీగ్ మ్యాచ్లు ఆడతాం. ప్రతిసారీ అన్ని విభాగాల్లో మంచి ప్రదర్శన చేయాలంటే కష్టమే. అందుకు ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి’ అని భువీ తెలిపాడు. కాగా ఈ సీజన్లో ఆర్సీబీ మంచి ప్రదర్శనలే చేస్తోంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడి ఆరింట్లో గెలిచింది. 12 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.









Comments