ఐఫోన్ ధరలు ఎందుకు తగ్గడం లేదు.. భారత్లో యాపిల్ వ్యూహం ఇదేనా..
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్లను విడుదల చేసింది. ధరలు భారీగా పెంచేసింది. భారత్లో సగటు వ్యక్తి వార్షిక తలసరి ఆదాయం సుమారు రూ.2.33 లక్షలు. ఇక యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో ధర గరిష్ఠంగా రూ.4,49,900 వరకు ఉంది. అంటే ఐఫోన్ డ్యుయో టాప్ వేరియంట్ ధర.. సగటు భారతీయుడి వార్షిక తలసరి ఆదాయం కంటే దాదాపు రెట్టింపు అన్నమాట.
భారత్లో ఐఫోన్ కొనగల స్థోమత ఉన్నవారు కేవలం ఐదు శాతం మంది మాత్రమే. దాదాపు 140 కోట్ల మంది భారతీయుల్లో కేవలం ఏడు కోట్ల మంది మాత్రమే ఐఫోన్లను కొనగలరు. అయితే ఆ సంఖ్య యూకే, ఫ్రాన్స్, ఇటలీ దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ. వారినే టార్గెట్ చేస్తూ యాపిల్ ప్రీమియం ఫోన్లను లాంఛ్ చేస్తోంది. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ విలువలో యాపిల్ వాటా సుమారు 28 శాతానికి చేరింది.
సాధారణంగా ఒక ఉత్పత్తి ధర తగ్గిస్తే మరింత మంది కొనుగోలు చేస్తారనేది మార్కెట్లో తరచుగా వినిపించే మాట. అయితే ఆ లాజిక్ యాపిల్ ఉత్పత్తులకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే భారత్లో ఐఫోన్కు ఓ ప్రీమియం ఇమేజ్ కూడా ఉంది. ఐఫోన్ అనేది కేవలం ఒక ఫోన్ కాదు.. స్టేటస్ సింబల్. ఐఫోన్ ధరలను తగ్గించేస్తే వాటిని ఎలాగైనా దక్కించుకోవాలనే మోజు కూడా తగ్గిపోతుంది. అందుకే యాపిల్ భారత్లోని కేవలం సంపన్నవర్గాలను మాత్రమే టార్గెట్ చేస్తోంది. సాధారణ ప్రజల కోసం ఎలాగూ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్, ఇతర ఫైనాన్సింగ్ ఆఫర్లు ఉన్నాయి.










Comments