• Jun 25, 2026
  • NPN Log

    టోక్యో: ఉత్తర జపాన్‌లో 6.9 తీవ్రతతో ఇవాళ (గురువారం) భారీ భూకంపం సంభవించింది. హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇవాటే ఉత్తర ప్రాంతానికి దూరంగా భూకంపం ఏర్పడిందని, దీని కేంద్రం సముద్ర మట్టానికి 50 కిలోమీటర్ల లోతులో ఉందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. దీంతో టోక్యోతో సహా దేశంలోని చాలా ప్రాంతాలు భూ ప్రకంపనలతో వణికిపోయాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళలకు గురయ్యారు. ఇంట్లోని వస్తువులు ఊగిపోగా.. ప్రాణభయంతో వారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

    మరోవైపు భూ ప్రకంపనల కారణంగా రవాణా సేవలకు తాత్కాలిక అంతరాయం కలిగింది. ముందు జాగ్రత్త చర్యగా షింకన్సెన్ బుల్లెట్ రైళ్ల కార్యకలాపాలను జపాన్ ప్రభుత్వం నిలిపివేసింది. అయితే, మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ మినోరు కిహారా తెలిపారు. అలాగే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు. ఘటనపై జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి స్పందించారు. అత్యవసర సహాయక చర్యలను చేపట్టాలని మంత్రులను, స్థానిక పరిపాలనా యంత్రాంగాన్ని ఆదేశించారు. భూకంపాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి నాలుగు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లు కలిసే చోట జపాన్ ఉంది. దీని కారణంగా ప్రపంచంలో అత్యధిక భూకంపాలు ఇక్కడ సంభవిస్తుంటాయి.

     

    ప్రపంచవ్యాప్తంగా వచ్చే భూకంపాల్లో దాదాపు 18 శాతం ఇక్కడే ఏర్పడుతుంటాయి. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌ 20న ఇవాటే సమీపంలో సముద్ర తీరానికి దూరంగా 7.7 తీవ్రతతో భూకంపం సంభవించి 10 మంది గాయపడ్డారు. తాజాగా అదే ప్రాంతంలో మరో భూకంపం సంభవించింది. 2011లో ఏర్పడిన 9.0 తీవ్రత గల భూకంపంతో సునామీ వచ్చి సుమారు 18,500 మంది ప్రాణాలు కోల్పోయారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement