• Aug 25, 2026
  • NPN Log

    హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మైనర్లకు మద్యం సరఫరా చేసిన ఘటన కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 36లోని లఫ్ట్ పబ్‌లో మైనర్లకు యథేచ్ఛగా మద్యం అందిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పక్కా సమాచారంతో పబ్‌పై రైడ్ చేసిన పోలీసులు అక్కడ మైనర్లు మద్యం సేవిస్తున్న విషయాన్ని గుర్తించారు. పోలీసులు పబ్‌లోకి ప్రవేశించగానే కొందరు మైనర్లు తప్పించుకునేందుకు, దాక్కునేందుకు ప్రయత్నించారు.

    అయితే పోలీసులు ఆధార్ కార్డులు చూపించాలని కోరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పబ్‌లో మొత్తం ఆరుగురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారందరికీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. పట్టుబడిన మైనర్లంతా సీఏ, జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరికి నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో 70 ఎంజీ, 74 ఎంజీ రీడింగ్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మైనర్లకు మద్యం సరఫరా చేయడంపై జూబ్లీహిల్స్ పోలీసులు లఫ్ట్ పబ్‌పై కేసు నమోదు చేశారు.

    మైనర్లకు మద్యం విక్రయించడం, సరఫరా చేయడంపై కఠిన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పబ్ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించారా, మైనర్లకు మద్యం ఎలా సరఫరా చేశారనే అంశాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. నిబంధనలు ఉల్లంఘించిన లఫ్ట్ పబ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని ఎక్సైజ్ అధికారులకు జూబ్లీహిల్స్ పోలీసులు సిఫారసు చేశారు. మైనర్లకు మద్యం అందకుండా పబ్‌లు, బార్లలో వయసు ధ్రువీకరణను కచ్చితంగా తనిఖీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement