టీమిండియాకు ‘కిట్’ సమస్య!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ పురుషుల జట్టు ఆసియా క్రీడలకు పయనమవుతున్న తరుణంలో కిట్ సమస్య తలెత్తింది. క్రీడలకు ఆతిథ్యమిస్తున్న జపాన్లోని నగోయ నగరానికి బయలుదేరడానికి ముందు వరకూ జట్టు సభ్యుల్లో కొందరికి జెర్సీలు అందలేదని సమాచారం. ఆసియాడ్ క్రికెట్ పోటీలకు ముందు శ్రేయాస్ సారథ్యంలోని టీమిండియా జపాన్తో ఏకైక టీ20 ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఒక్క మ్యాచ్కు ఒక జెర్సీ, తర్వాత ఆసియా క్రీడలకు అధికారిక జెర్సీ మరొకటి జట్టుకు అందాల్సి ఉంది. ‘రెండు రకాల జెర్సీలు ఉన్నందున జట్టులో కొందరికి సైజ్ విషయంలో సమస్య ఏర్పడింది. దానిని చాలా వరకు పరిష్కరించాం’ అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు శనివారం వెల్లడించాయి.
బీసీసీఐ ఆధ్వర్యంలోనే బస..
ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న అథ్లెట్లకు బస విషయంలో సమస్యలు ఏర్పడిన దరిమిలా.. టీమిండియాకు ఆ ఇబ్బంది ఎదురుకాకుండా బీసీసీఐ చర్యలు తీసుకుంది. క్రికెట్ జట్టుకు బోర్డు ఆధ్వర్యంలోనే హోటల్ వసతి కల్పించింది. అయితే ఇప్పటికే నగోయలో ఉన్న మహిళల క్రికెట్ జట్టు మాత్రం ఐఓఏ ఏర్పాటు చేసిన బసలోనే ఉంటోంది.










Comments