పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో రూ.5.47 లక్షలకు టోకరా
హైదరాబాద్ : ఇన్స్టాగ్రామ్లో పార్ట్టైమ్ ఉద్యోగ ప్రకటన చూసిన మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.5.47 లక్షలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ రంగానగర్కు చెందిన మహిళ డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఈనెల 9న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుండగా పార్ట్టైమ్ ఉద్యోగ ప్రకటన కనిపించడంతో దానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆమెను వాట్సాప్ ద్వారా సంప్రదించిన వ్యక్తి తనను ‘కైలా కుహిక్’గా పరిచయం చేసుకుని, టెలిగ్రామ్లో అనన్య అనే వ్యక్తిని సంప్రదించాలని సూచించారు.
ఆమెను ఎన్ఎస్ఈ గ్రూపు - టాస్క్1, టీచర్ ఎన్ఎ్సఈ గ్రూపు వంటి టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చారు. మహిళ ఉత్పత్తుల ప్రచారానికి సంబంధించిన టాస్కులు పూర్తి చేస్తే మంచి పారితోషికం లభిస్తుందని నమ్మించారు. ప్రారంభంలో రూ.120, రూ.200 చెల్లించి నమ్మకం కల్పించారు. తర్వాత భారీ లాభాలు వస్తాయని ఆశచూపడంతో బాధితురాలు చిన్నమొత్తాల్లో డబ్బు పంపింది. దానికి బదులుగా రూ.2000, రూ.3000 తిరిగి చెల్లించడంతో ఆమె నమ్మింది. దీంతో ఆమె పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టింది. విడతల వారీగా ఆమె రూ.5.47 లక్షలు పెట్టింది. భారీ మొత్తంలో లాభాలు వచ్చినట్లు వర్చువల్గా చూపుతున్నా, డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.









Comments