బళ్లారి చేరుకున్న మంత్రి లోకేశ్.. పలు ప్రాజెక్ట్లకు శంకుస్థాపన
బళ్లారి : బళ్లారిలో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటించనున్నారు. ఈరోజు(మంగళవారం) ఉదయం బళ్లారిలోని జిందాల్ విజయ్నగర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న మంత్రికి కర్ణాటక మంత్రి నాగేంద్ర, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, పల్లె సింధూర రెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీ ప్రసాద్, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉమర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
కాసేపట్లో బళ్లారి మండలం హలకుందిలోని సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డును లోకేశ్ సందర్శించనున్నారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామంలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్కు శంకుస్థాపన చేస్తారు. పవన విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ను ప్రారంభించనున్నారు. అనంతపురం జిల్లాలో సుజ్లాన్ సంస్థ రూ.10వేల కోట్ల పెట్టుబడితో 1325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సుజ్లాన్ సంస్థ కల్పించనుంది.









Comments