భూకబ్జా ఆరోపణలు.. నిర్మాత సి.కల్యాణ్ పై కేసు నమోదు
సినీ నిర్మాత సి.కల్యాణ్, మరో ఇద్దరిపై భూకబ్జా ఆరోపణలు చేస్తూ సియట్ సొసైటీ సభ్యుడు శ్యామ్ సింగ్ శనివారం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. మాదాపూర్ సున్నం చెరువు వద్ద సర్వే నంబరు 12, 12ఏ, 13 (గుట్టల బేగంపేట్)లో సియట్ సొసైటీకి చెందిన స్థలంలో పలువురికి ప్లాట్లు ఉన్నాయి. సి.కల్యాణ్ ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రకాష్ ధారక్, ప్రేమలత ఇతరులతో కలిసి తమ ప్లాట్లలోకి చొరబడి తాము లోపలికి వెళ్లకుండా స్థలం చుట్టూ బ్లూ షీట్లు వేశారని శ్యామ్ సింగ్ ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నించారన్నారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థలం వద్దకు రాలేదన్నారు. మళ్లీ ఇప్పుడు వచ్చి ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. దాంతో పోలీసులు స్థలం వద్దకు వచ్చి పరిశీలించారు. అక్కడ పనులను తాత్కాలికంగా ఆపేశారు. రెండు వర్గాల వారి వద్దనున్న డాక్యుమెంట్లు పరిశీలించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు.










Comments