• Sep 20, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : రజనీకాంత్‌ ‘రోబో’ సినిమాలో... ‘చిట్టి’ తనను తానే క్లోన్‌ చేసుకుని వందల సంఖ్యలో తనలాంటి రోబోలను తయారు చేస్తుంది. కానీ.. అదొక సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా..! చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ‘ఎక్స్‌పెంగ్‌’ దీన్ని నిజం చేసేలా కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా రోబోలతోనే రోబోలను తయారు చేసే సరికొత్త ఉత్పత్తి కేంద్రాన్ని ఇటీవలే ప్రారంభించినట్టు ఆ సంస్థ తెలిపింది. గ్వాంగ్‌జౌలో ఏర్పాటు చేసిన ఈ ఉత్పత్తి కేంద్రంలో రోబోల తయారీ ప్రక్రియలో 80 శాతానికిపైగా పనులు ఆటోమేషన్‌ ద్వారా జరుగుతాయని వెల్లడించింది. ఇక్కడ తయారైన మొదటి ‘ఐరన్‌’ రోబో అసెంబ్లింగ్‌ పూర్తిచేసుకుని తనంతట తానే ప్రొడక్షన్‌ లైన్‌ నుంచి బయటకు వచ్చిన వీడియోను ఆ సంస్థ విడుదల చేసింది. అది ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ ఉత్పత్తి ప్రక్రియలో మనుషులతోపాటు యంత్రాలు, స్వయంచాలిత వ్యవస్థలు భాగమయ్యాయి. అయితే ఇందులో 80 శాతం ప్రక్రియను స్వయంచాలిత వ్యవస్థలే పూర్తిచేస్తాయి. తన ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యాపారంలోని అనుభవాన్ని రోబోల తయారీలో ఉపయోగిస్తున్నట్టు ‘ఎక్స్‌పెంగ్‌’ తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి ‘ఐరన్‌’ల ఉత్పత్తిని భారీస్థాయిలో పెంచాలని, అలాగే 2027లో చైనాతోపాటు ప్రపంచ మార్కెట్‌లోకి వీటిని విరివిగా సరఫరా చేయాలనేది తమ లక్ష్యమని ఆ సంస్థ పేర్కొంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement