• May 01, 2026
  • NPN Log

    ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో కేవలం రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. గాయం కారణంగా కీలక ప్లేయర్లు ఆటకు దూరం అవ్వడం, మ్యాచ్‌ను మలుపు తిప్పాల్సిన ప్లేయర్లు ఫామ్‌లో లేకపోవడంతో ఎంఐకి ఓటములు తప్పట్లేదు. భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్య మైదానంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్లే జట్టుకు పరాభవం తప్పట్లేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకున్న శార్దూల్ ఠాకూర్‌కు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడం చర్చనీయాంశం అయింది. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, మురళీ కార్తిక్ స్పందించారు.

    ‘నాకు ఇప్పటికీ అర్థంకాని విషయం ఏంటంటే.. శార్దూల్‌ను ఓ ఆప్షన్‌గా మైదానంలోకి తీసుకొచ్చారు. కానీ అతడిని మర్చిపోయారో? లేదా ఇంకా ఏదైనా జరిగిందో అర్థం కాలేదు. శార్దూల్‌కు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. నన్ను బాగా గమనించండి.. నా ముఖంలో అదే ఆశ్చర్యం కనిపిస్తోంది’ అని మురళీ కార్తిక్ తెలిపాడు. దానికి సరదాగా స్పందించిన సెహ్వాగ్.. ‘నాకు ఆ రెడ్ బుల్ క్యాన్ ఇవ్వు. కార్తిక్ మీద స్ప్రే చేసి అతడి ముఖంలో వెతుకుతా’ అని వ్యాఖ్యానించాడు.

    ‘మీరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటర్ లేదా బౌలర్‌ను తీసుకున్నందుకైనా అతడిని వినియోగించుకోవాలి. శార్దూల్‌కు కనీసం ఒక్క ఓవర్ అయినా ఇస్తే బాగుండేది. అతడు వికెట్ టేకింగ్ బౌలర్. కనీసం శార్దూల్‌కు బంతి ఇచ్చి వికెట్ కోసం ప్రయత్నిద్దామని కూడా కెప్టెన్‌కు అనిపించలేదు. ఆ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకు ఇవ్వలేదో మీరే హార్దిక్‌ను అడగాలి. అతడు మైదానంలో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నాడో అర్థమే కావడం లేదు’ అని సెహ్వాగ్ తెలిపాడు. అయితే ఎంఐకి ఇప్పటికే దాదాపు ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు అయినట్టే! ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ గెలిస్తే తప్ప ముంబై ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం కష్టం. కాగా ఎంఐ తన తదుపరి మ్యాచ్‌ను శనివారం సీఎస్కేతో తలపడనుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement