25 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం.. వెల్లడించిన టీసీఎస్..
భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27) 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. డిమాండ్ను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంస్థ స్పష్టం చేసింది. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 44 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్యను 25 వేలకు తగ్గించింది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఉద్యోగాలు ఎక్కువనే చెప్పాలి.
గత మూడేళ్లుగా కంపెనీ ప్రతి సంవత్సరం కనీసం 40 వేలకు పైగా కొత్తవారిని నియమిస్తోందని, వ్యాపార అవసరాలను బట్టి నియామక వ్యూహాలు మారుతాయని టీసీఎస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కృతివాసన్ వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను సంస్థ తొలగించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగానే వారిని తొలగించినట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. సీనియర్ స్థాయి ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఆ తొలగింపులు జరిగినట్టు తెలిపారు.
సాధారణంగా ఒక ఫ్రెషర్ను పూర్తిస్థాయి ఉద్యోగిగా తయారు చేయడానికి సుమారు 9 నెలల ట్రైనింగ్ అవసరమవుతుందని, అదే ఇతర సంస్థల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైతే వెంటనే ప్రాజెక్టుల్లో పనిచేయగలరని కృతివాసన్ చెప్పారు. అవసరాన్ని బట్టి నియామకాల వ్యూహాలు మారుతుంటాయని అన్నారు. కంపెనీలో మంచి పనితీరు కనబరిచే ఉద్యోగులకు కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయన స్పష్టం చేశారు.










Comments