ఆసియా క్రీడల్లో నఖ్వీ పతకాలు ఇస్తే ఏం చేస్తారు.. బీసీసీఐ స్పందన ఏంటంటే..
భారత పురుషుల జట్టు 2025 ఆసియా కప్, భారత మహిళల జట్టు 2026 ఆసియా కప్ టైటిళ్లు గెలిచినప్పటికీ.. పాకిస్థాన్కు చెందిన మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించాయి. త్వరలో జపాన్ వేదికగా ఆసియా క్రీడలు జరగబోతున్నాయి. ఈ క్రీడల్లో భారత జట్లు పతకాలు సాధిస్తే.. వాటిని మొహ్సిన్ నక్వీ అందజేస్తే స్వీకరిస్తారా అనే చర్చ మొదలైంది.
ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా నిబంధనల ప్రకారం పతకాలను ఓసీఏ అధ్యక్షుడు లేదా ఆయన నియమించిన ప్రతినిధి అందజేస్తారు. విజయోత్సవ కార్యక్రమాల్లో రాజకీయ ప్రదర్శనలు లేదా ప్రచారానికి అనుమతి ఉండదు. ఒకవేళ ఓసీఏ అధ్యక్షుడు అయిన షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ.. నఖ్వీకి అధికారికంగా ఈ బాధ్యతను అప్పగిస్తే, భారత అథ్లెట్లు తమ పతకాలను స్వీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ పతకాలు తీసుకోవడానికి నిరాకరిస్తే, దానిని క్రీడలను, ఓసీఏను అగౌరవపరిచినట్లుగా పరిగణిస్తారు. దీని ఫలితంగా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. 'మేము కేవలం మ్యాచ్ల మీదే దృష్టి సారిస్తున్నాము. జట్లు ముందుగా పోడియంపైకి చేరుకోవాలి. ఆ క్షణంలో ఉన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకుంటాము. ఆ సమయం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాము. ప్రస్తుతం బోర్డు, ఆటగాళ్ల దృష్టి కేవలం మ్యాచ్లు గెలవడంపైనే ఉంది. ఇంకా జరగని ఇతర విషయాలపై మేము వ్యాఖ్యానించదలుచుకోలేదు' అని స్పష్టం చేశారు.










Comments