ఇండిగో ప్రయాణం మరింత ప్రియం
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులపై అదనపు భారం మోపింది. లగేజీ పరిమితి దాటితే వసూలు చేసే చార్జీలతో పాటు శిశువుల ప్రయాణం, ఒంటరిగా వెళ్లే చిన్నారులు, ప్రయారిటీ సేవలు సహా పలు రకాల ప్రత్యేక సేవా రుసుం(యాడ్- ఆన్ సర్వీసె్స)లను భారీగా పెంచింది. సవరించిన ధరలను గురువారం నుంచి అమల్లోకి తెచ్చింది. అనుమతించిన పరిమితి కంటే ఎక్కువ ఉన్న లగేజీకి కేజీ ఇదివరకు రూ. 700 ఉండగా, ఇకపై రూ. 800 చెల్లించాలి. మూడు రోజుల నుంచి రెండేళ్ల వయసున్న శిశువులకు ప్రత్యేక సీటు కేటాయించక పోయినా టికెట్ తప్పనిసరి కాగా, ఆ ధరను రూ. 2వేల నుంచి ఏకంగా రూ. 3వేలకు పెంచారు. అలాగే, పెద్దల తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణించే చిన్నారులకు అందించే ‘అన్అకంపనీడ్ మైనర్’ సర్వీస్ చార్జీని దేశీయ విమానాల్లో రూ. 5వేల నుంచి రూ. 5,999కి, అంతర్జాతీయ విమానాల్లో రూ.12,999కి సవరించారు. త్వరగా చెక్- ఇన్, బోర్డింగ్ సదుపాయం కల్పించే ‘ఫాస్ట్ ఫార్వార్డ్’ సేవలకు దేశీయంగా రూ. 500 నుంచి రూ.650కి, అంతర్జాతీయ మార్గాల్లో ప్రతి సెక్టారుకు రూ. 850కి పెంచారు.










Comments