మూడు కంపెనీలను హ్యాక్ చేసిన గూగుల్ జెమినీ.. పాస్వర్డ్లను కూడా ఊహించి..
గూగుల్కు చెందిన జెమినీ ఏఐ సైబర్ సెక్యూరిటీ పరీక్షలో సంచలనాలు నమోదు చేసింది. వాస్తవంగా ఉన్న మూడు కంపెనీల వ్యవస్థలను హ్యాక్ చేసింది. అలాగే పాస్వర్డ్లను కూడా సరిగ్గా అంచనా వేయగలిగింది. అలాగే ఆన్లైన్లో బహిరంగంగా అందుబాటులో ఉన్న ఆధారాలను ఉపయోగించి సంబంధిత వ్యవస్థలను యాక్సెస్ చేసింది. ఈ ఘటన మే 2026లో 'ఇర్రెగ్యులర్' అనే స్వతంత్ర ఏఐ సెక్యూరిటీ టెస్టింగ్ సంస్థ నిర్వహించిన పరీక్షలో చోటుచేసుకుంది.
జెమినీకి ఒక కల్పిత సంస్థకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిని అప్పగించారు. అయితే పరీక్షలో ఉపయోగించిన కల్పిత సంస్థ పేరుతోనే నిజమైన కంపెనీ కూడా ఉంది. దీంతో గూగుల్ జెమినీ ఆ నిజమైన సంస్థల సేవలను యాక్సెస్ చేసింది. ఒక సంస్థకు చెందిన పాస్వర్డ్ను సరిగ్గా అంచనా వేసి ఆ వ్యవస్థలోకి ప్రవేశించింది. మరో రెండు సంస్థలకు సంబంధించి ఆన్లైన్లో బహిరంగంగా అందుబాటులో ఉన్న ఆధారాలను ఉపయోగించి యాక్సెస్ చేసింది. ఈ మూడు కంపెనీలు నిజంగానే ఉన్నాయి.
ఆ మూడు కంపెనీలు నిజంగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయని గుర్తించిన తర్వాత జెమినీ మరింత ముందుకు వెళ్లలేదు. ఈ ఘటనలో ప్రభావితమైన మూడు కంపెనీల పేర్లను గూగుల్ బహిరంగంగా వెల్లడించలేదు. అయితే ప్రభావిత సంస్థలకు సమాచారం అందించామని, పరీక్షా విధానాల్లో అవసరమైన మార్పులు చేశామని గూగుల్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ విభాగం తెలిపింది.
జెమినీ ఒక్కటే కాదు.. ఇదే సెక్యూరిటీ పరీక్షా వ్యవస్థకు సంబంధించిన సమస్యల నేపథ్యంలో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, మెటాకు చెందిన ఏఐ మోడళ్లతోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఏఐ ఏజెంట్లకు ఇంటర్నెట్, కంప్యూటర్ వ్యవస్థలు, వివిధ డిజిటల్ సాధనాలకు ఎక్కువ స్వతంత్ర యాక్సెస్ లభిస్తున్న నేపథ్యంలో స్పష్టమైన భద్రతా నిబంధనలు ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు చూపిస్తున్నాయి.










Comments