• Dec 10, 2025
  • NPN Log

    ముంబై: ఐపీఎల్‌ మినీ వేలం కోసం 350 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ సిద్ధం చేసింది. ఈ నెల 16న దుబాయ్‌లో ఈ వేలం జరగనుంది. మొత్తం 1390 మంది క్రికెటర్లు వేలం కోసం పేర్లు నమోదు చేసుకోగా.. 1005 మందికి తగ్గించిన బీసీసీఐ మరింతగా వడపోసి 350కి కుదించింది. వీరిలో 240 మంది భారతీయులు కాగా.. 110 మంది విదేశీ ఆటగాళ్లు. అయితే, రిటైర్మెంట్‌ను వెనక్కితీసుకొని వన్డేలు, టీ20లు ఆడుతున్న దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ పేరు కూడా వేలానికి రానుండడం విశేషం. తొలుత జాబితాలో అతడి పేరు లేకపోయినా.. ఓ ఫ్రాంచైజీ ఒత్తిడితో చేర్చినట్టు తెలుస్తోంది. డికాక్‌ కనీసధర రూ. కోటి కాగా.. 2021లో ఐపీఎల్‌ ఆడిన ఆస్ట్రేలియా బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ పేరు రూ. 2 కోట్ల కేటగిరీలో ఉండడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఈ వేలంద్వారా ఖాళీగా ఉన్న 77 స్థానాలను భర్తీ చేయనుండగా.. అందులో 31 విదేశీ ప్లేయర్ల కోసం ఉద్దేశించినవి. కాగా, కనీస ధర రూ. 2 కోట్ల కేటగిరీలో 40 మంది పేర్లు నమోదు చేసుకోగా.. కోల్‌కతా వదిలేసిన వెంకటేష్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌ మాత్రమే ఈ జాబితాలో ఉన్న భారత ప్లేయర్లు. కామెరూన్‌ గ్రీన్‌ భారీ ధర పలికే అవకాశం ఉంది. కాగా పృథ్వీ షా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆకట్టుకొంటున్న దేశవాళీ ప్లేయర్లు కునాల్‌ చండేలా, అశోక్‌ కుమార్‌పై ఫ్రాంచైజీలు ఆసక్తి ప్రదర్శించే అవకాశం ఉంది. లివింగ్‌ స్టోన్‌, జేమీ స్మిత్‌, అట్కిన్సన్‌, బెన్‌ డకెట్‌ ఇలా 21 మంది ఇంగ్లండ్‌ ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. మాథ్యూ షార్ట్‌, జోష్‌ ఇంగ్లిస్‌, నోకియా, ఎన్‌గిడి, షాయ్‌ హోప్‌, రోస్టన్‌ చేజ్‌, అల్జరీ జోసెఫ్‌, హసరంగ, రచిన్‌ రవీంద్ర లాంటి విదేశీ పేయర్లకు డిమాండ్‌ నెలకొనే అవకాశం ఉంది. వేలంలో పాల్గొనే ఫ్రాంచైజీల్లో అత్యధికంగా కోల్‌కతా రూ. 64.3 కోట్లు, చెన్నై రూ. 43.4 కోట్లు, సన్‌రైజర్స్‌ రూ. 25.5 కోట్ల పర్స్‌ కలిగి ఉన్నాయి.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement