• Sep 20, 2026
  • NPN Log

    వేగంలో విమాన ప్రయాణానికి మరేదీ సాటి రాదు. అయితే ఇప్పుడు విమానంతో పోటీ పడే రైళ్లను చైనా, జపాన్ తయారు చేసే పనిలో పడ్డాయి. సాంకేతికత అభివృద్ధిలో తారస్థాయికి చేరిన ఈ రెండు దేశాలూ ఎయిర్ ట్రావెల్‌కు సరైన ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టడానికి సిద్ధమయ్యాయి. అత్యాధునిక విద్యుదయస్కాంత శక్తిని ఉపయోగించి రవాణా వ్యవస్థల రూపురేఖలు మార్చడానికి తహతహలాడుతున్నాయి. ఇందులో భాగంగా మాగ్లెవ్స్ రైళ్లను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. సాధారణ కమర్షియల్ విమానం గంటకు 885 కిలోమీటర్ల వేగంతో పయనిస్తే, ఈ మాగ్లెవ్స్ ట్రైన్లు ఇంచుమించు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి.

    చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సీఆర్ఆర్సీ సంస్థ ఇప్పటికే మాగ్లెవ్స్ రైళ్ల నమూనాను రూపొందించింది. బుల్లెట్ ట్రైన్లకు, విమానాలకు మధ్య వ్యత్యాసం తగ్గించే విధంగా అయస్కాంత శక్తితో నడిచే మాగ్లెవ్స్ రైళ్ల అభివృద్ధి దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆ దేశ ఇంజినీర్లు శ్రమిస్తున్నారు. రైలు వేగం కారణంగా ‘టన్నెల్ బూమ్’ లాంటి సమస్యలు రాకుండా ఉండేలా సొరంగ మార్గాలను రూపొందిస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే బీజింగ్ నుంచి షాంఘై వెళ్లే మార్గంలో ఈ మాగ్లెవ్స్ ట్రైన్‌ను ఏర్పాటు చేస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. కేవలం 2.5 గంటల్లో గమ్యాన్ని చేరుకోవచ్చు. బీజింగ్ నుండి షాంఘై విమానంలో వెళ్లినా డోర్ టూ డోర్ టైమ్ (ఇంటి నుంచి గమ్యస్థానానికి చేరుకోవడానికి పట్టే సమయం)తో కలిపి 2.5 గంటలే పడుతుంది. పైగా మాగ్లెవ్ రైల్లో ప్రయాణం పర్యావరణ హితంగా ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement