సొంత పార్టీ నేతలపై తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ సంచలన వ్యాఖ్యలు
శ్రీకాకుళం : వైసీపీ నేతలపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ్మినేని సీతారాం రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్లు ఉండవని, కామాలు మాత్రమే ఉంటాయని తెలిపారు. తమ్మినేనిపై మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ చేసిన వ్యాఖ్యలు జిల్లా పార్టీ అధ్యక్షుడు కనీసం ఖండించకపోవడం అమానుషమని పేర్కొన్నారు. గతంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో ధర్మాన నుంచి కిరణ్ను కాపాడింది సీతారం కాదా. ! అని ప్రశ్నించారు.
తమ్మినేని, కూన రవికుమార్ మధ్య రాజకీయ ఒప్పందం ఉందంటూ వైసీపీ నేతలే వ్యాఖ్యలు చేయటం ఏంటి..? అని చిరంజీవి నాగ్ నిలదీశారు. ఈ అంశంపై వైసీపీ జిల్లా కీలక నేతలు ధర్మాన సోదరులు, కుంభ రవిబాబు, భూడి ముత్యాల నాయుడు మాట్లాడక పోవడం దారుణమని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీకాకుళం జిల్లాలో త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదని చెప్పుకొచ్చారు.
సీతారాం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వివక్షత చూపలేదని చిరంజీవి నాగ్ అన్నారు. జిల్లాలో ఓకే కులం కోసం పార్టీ ముందుకు పోతుందని ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. చింతాడ రవి వైసీపీ ఆమదాలవలస అభ్యర్థిగా ఉంటారో లేదోనని నేతల్లో అభద్రత ఉందని తెలిపారు. వైసీపీ అధిష్ఠానం శ్రీకాకుళం జిల్లా నాయకత్వ తీరుపై ఓ సర్వే చేయాలని చిరంజీవి నాగ్ కోరారు.









Comments