• Mar 02, 2026
  • NPN Log
    భద్రాద్రి కొత్తగూడెం : మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో పబ్లిక్ పరీక్షల నిర్వహణకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, జాయింట్ కస్టోడియన్లు, సి-సెంటర్ కస్టోడియన్లు, మండల విద్యాశాఖాధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పరీక్షలకు 12,731 మంది రెగ్యులర్ విద్యార్థులు, 404 మంది ప్రైవేట్ అభ్యర్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడతాయని వెల్లడించారు.విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అత్యంత కీలక అంశం కావడంతో పరీక్షల నిర్వహణలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, జాయింట్ కస్టోడియన్లు మరియు సెంటర్ సూపరింటెండెంట్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. మండల విద్యాశాఖాధికారులు (MEOలు), రెవెన్యూ డివిజనల్ అధికారులు (RDOలు) తమ పరిధిలోని పరీక్షా కేంద్రాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలని సూచించారు.గతంలో చోటుచేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశ్నపత్రాల భద్రత, రవాణా, భద్రపరిచే విధానం, సమయపాలన వంటి అంశాల్లో ఎటువంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు.పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 బి ని అమలు చేయడంతో పాటు, పోలీస్ శాఖ ద్వారా పర్యవేక్షణను బలోపేతం చేయాలని అన్నారు . కాపీచేసే చర్యలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు పరిశీలక బృందాలను నియమించాలని ఆదేశించారు.విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అనుకూల పరిస్థితులు కల్పించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, సరిపడ ఫర్నిచర్, పరిశుభ్రమైన మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా చూడాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు రైటర్ సౌకర్యం, ర్యాంపులు తదితర అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.అన్ని పరీక్షా విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది విధిగా తమ ఐడీ కార్డులను ధరించాలని కలెక్టర్ స్పష్టంగా ఆదేశించారు. ఐడీ కార్డు లేకుండా ఎవరినీ పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించరాదని ఆదేశించారు.చీఫ్ సూపరింటెండెంట్లు ప్రభుత్వ నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలలో మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధించబడినవని, నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ శంభు ప్రసాద్, పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement