భారత్లో పర్యటించనున్న నేపాల్ విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనల్ మూడు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. పర్యటన నిమిత్తం ఈ రోజు నేపాల్ నుంచి ఢిల్లీకి రానున్నారు. భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు.. రెండు దేశాల మధ్య ద్వైపాశ్చిక సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో శిసిర్ భారత్కు వస్తున్నారు. జూన్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆయన పర్యటన సాగుతుంది.
ఈ రోజు రెండు దేశాల విదేశాంగ మంత్రులు పలు అంశాలపై అధికారిక చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడంపై చర్చలు జరగనున్నాయి. 2026 ఏప్రిల్ నెలలో నేపాల్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శిశిర్ ఖనల్కు భారతదేశం నుంచి అందిన మొదటి అధికారిక ఆహ్వానం ఇదే కావటం విశేషం.
సరిహద్దు వివాదాల నేపథ్యంలో..
గత కొన్నేళ్ల నుంచి భారత్, నేపాల్ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు నడుస్తున్నాయి. సరిహద్దు వివాదాల నేపథ్యంలో శిశిర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్దిరోజుల క్రితం నేపాల్ నూతన ప్రధాని బాలేంద్ర షా రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై నేపాల్ పార్లమెంట్లో మాట్లాడారు. ‘మీరు ఈ వాస్తవం తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఈ విషయం నాకు ఇటీవలే తెలిసింది. భారత్ మాత్రమే నేపాల్ భూభాగాల్ని ఆక్రమించలేదు. నేపాల్ కూడా అదే పని చేసింది. అనేక చోట్ల భారత భూభాగాల్ని ఆక్రమించింది. రెండు దేశాలు ఈ ఆక్రమణలను అధ్యయనం చేసి స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాల్సి ఉంది’ అని అన్నారు.









Comments