రోగివేషంలో ఆస్పత్రికి జిల్లా కలెక్టర్.. ఆ తర్వాత..
చెన్నై: పెరంబలూరు జిల్లా గోల్కానత్తం ప్రాథమిక కేంద్రానికి సాధారణ రోగి వేషంలో వెళ్లిన జిల్లా కలెక్టర్ మృణాళిని అక్కడ ప్రజలకు ఏవిధంగా వైద్యం అందుతుందో పరిశీలించారు. ఇటీవల గోల్కానత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కు.ని శస్త్రచికిత్స చేయించుకున్న ఓ మహిళ.. ఆస్పత్రిలో చికిత్స సరిగ్గా లేదంటూ జిల్లా కలెక్టర్ కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో, ఘటన జరిగిన రోజు సాయంత్రం.. సాధారణ రోగి వేషంలో కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు.
తనకు ఆరోగ్యం సరిగా లేదని ఆస్పత్రిలో ఉన్న నర్సుకు చెప్పగా, నర్సు ఎలాంటి పరీక్ష చేయకుండానే ఇంజక్షన్ వేసేందుకు సిద్ధమైంది. దాంతో అప్రమత్తమైన కలెక్టర్ ఇక్కడ డాక్టర్లు ఎవరూ లేరా?.. వారు రోగులను చూడరా అంటూ ప్రశ్నించారు. అప్పటికి ఆమెను కలెక్టర్గా గ్రహించిన నర్సు వణికిపోయింది. ఆ కేకలు విని ఆస్పత్రి సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు.
డాక్టర్ గురించి ఆరా తీయగా అందరూ నీళ్లు నమిలారే తప్ప ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. దీంతో రిజిస్టర్ పరిశీలించిన కలెక్టర్ దానిని సక్రమంగా నిర్వహించడం లేదని తెలుసుకున్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సుపైనా, విధులకు గైర్హాజరైన వైద్యుడిపైనా శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
Comments