సూర్యను సారథ్యం నుంచి తప్పించడం సరికాదు: మాజీ క్రికెటర్
టీమిండియా టీ20 కెప్టెన్సీలో మార్పులు రానున్నట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ ను తప్పించి.. శ్రేయస్ అయ్యర్ ను కొత్త కెప్టెన్ గా ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన కెప్టెన్సీలో టీమిండియాకు 2026 ప్రపంచ కప్ అందించినప్పటికీ.. వ్యక్తిగత ప్రదర్శన విషయంలో ఘోరంగా విఫలమయ్యాడని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే టీ20 ప్రపంచ కప్ నాటికి కొత్తవారిని సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకునేందుకు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఇంగ్లండ్ పర్యటనకు ఫస్ట్ టీమ్ను పంపిస్తారా? ద్వితీయ శ్రేణిని పంపిస్తారా?. ఒకవేళ మీరు అత్యుత్తమ జట్టునే పంపించాలనుకుంటే మాత్రం సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించడం సరికాదు. అతడు భారత్ కు ప్రపంచ కప్ అందించిన కెప్టెన్. సూర్య అద్భుతమైన ఆటగాడు. బ్యాటర్గా గత ఏడాదిన్నర కాలంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. కొత్త కుర్రాళ్లు తమ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగని ఇలాంటి సమయంలో సూర్యను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించడం సరికాదనేదని నా అభిప్రాయం. ఈ రెండు సిరీసుల్లో అవకాశం ఇవ్వండి. అప్పుడు కూడా అతడి ఆటతీరు బాగోలేకపోతే.. వేరే వారికి జట్టు పగ్గాలను అప్పగించవచ్చు’ అని ఎమ్మెస్కే అన్నారు.
‘ఇప్పుడు భారత జట్టులో ప్రతిభకు కొదవలేదు. కెప్టెన్ రేసులోనూ చాలామంది ఉన్నారు. సంజు శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్.. శ్రేయస్ అయ్యర్ ఈపోటీలో ఉన్నారు. మరోవైపు ఐపీఎల్లో ఆడిన ప్లేయర్లకు కాస్త విరామం ఇస్తే బాగుంటుంది. దీంతో కొత్త వారికి అవకాశాలు ఇచ్చేందుకు వీలు కలుగుతుంది. అప్పుడు శ్రేయస్ లేదా ఇతర ఆటగాళ్లకు కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్, సంజు, రజత్ పాటిదార్ వంటి ప్లేయర్లను ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక చేస్తే బాగుంటుంది’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు.









Comments