• Jan 15, 2026
  • NPN Log

    పుట్టపర్తి(అనంతపురం): ఉచితం మాటున వ్యాపారులు యథేచ్ఛగా ఇసుకను తోడేస్తూ, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సామాన్యులు తమ నిర్మాణాలకు ఇసుక దొరకడం లేదని వాపోతున్నారు.


    ఖాళీ అవుతున్న చిత్రావతి

    జిల్లాలో ఇసుక అవసరాలు తీరుస్తున్న వనరుల్లో చిత్రావతి నది ఒకటి. జిల్లాలో ఈ నది దాదాపు 100 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఈ నది, పరిసర ప్రాంతాలు ఇసుక వ్యాపారులకు కల్పతరువుగా మారాయి. కొందరు రాత్రిపూట ఎక్స్‌కవేటర్‌తో ఇసుకను నది నుంచి తోడి తమకనుకూలమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. బేరం కుదిరిన తర్వాత డంపు చేసిన ఇసుకను మరోచోటుకు రవాణా చేస్తున్నారు. ఆదాయం బాగుండటంతో వ్యాపారులు నదిలో ఇసుక మేట కనపడితే చాలు తోడేస్తున్నారు. దీంతో నదీలో ఇసుక ఖాళీ అవుతోంది. ఈక్రమంలో ఎటుచూసినా గుండ్లు, రాళ్లు దర్శనమిస్తున్నాయి.

     

    చోద్యం చూస్తున్న అధికారులు

    ఇసుకను సొంత అవసరాలకు తప్ప వ్యాపార నిమిత్తం తరలించరాదని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. అయితే గృహాల నిర్మాణానికి ఇసుక తోలుతున్నామంటూ ట్రాక్టర్లో నింపుకుని తమ సొంత స్థలాల్లో డంపు చేస్తున్నారు. గృహ నిర్మాణాలకు కాస్త తోలి మిగిలిన వందల ట్రాక్టర్లను రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

    ఇసుకను తోడేస్తే నదిని ఆనుకుని ఉన్న తమ భూములు కోతకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవిస్తున్నా ప్రయోజనం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పొలాల కింద ఇసుక తీయవద్దని వ్యాపారులను ఎవరైనా అడ్డుకుంటే ‘నదిలో ఇసుక తవ్వుతున్నాం. ఇందులో మీకేం సంబంధం అంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఎనుములపల్లి, రాయలవారిపల్లి, కోవెలగుట్టపల్లి రైతులు వాపోతున్నారు. ఇలా ఇసుకను తవ్వేస్తే పొలాల్లోని బోరుబావులు సైతం ఎండిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకుని ఇసుక అక్రమాలను కట్టడి చేయాలంటూ కోరుతున్నారు.

     

    మాఫియాగా మారి..

    అమడగూరు, ఓడీ చెరువు మండలాల్లో మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తూ ట్రాక్టర్‌కు రూ.మూడు వేలు వసూలు చేస్తున్నారు. వాగులు, వంకలు, ఏరుల్లో నుంచి ఇసుకను యంత్రాల సాయంతో తోడి రహస్య ప్రాంతాల్లో డంపు చేస్తున్నారు. తర్వాత రాత్రిపూట రాష్ట్రం దాటించి వేలు లక్షల రూపాయలు గడిస్తున్నారు. మహమ్మదాబాదు క్రాస్‌లో దాదాపు 25 ట్రాక్టర్లు పెట్టుకొని అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇసుక మాఫియాగా మారారని చుట్టుపక్కల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇష్టారాజ్యంగా ఇసుక తరలించేవారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ రామనాథరెడ్డి పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement