ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. కఠిన చర్యలు: కేంద్రం
న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. ఇకపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అలాంటి పోస్టులు పెట్టే వారికి నేరుగా కేంద్రం నోటీసులు జారీ చేయనుంది. అలాగే ఆ పోస్ట్ను షేర్ చేసే వారిపై సైతం కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమిస్తోంది. అందుకోసం దేశ భద్రత పేరిటి కొత్త ప్రతిపాదనలను కేంద్రం తీసుకు వస్తుంది. అందుకోసం ఐటీ రూల్స్ సవరణకు కేంద్రం ఇప్పటికే సిద్ధమైంది. దాంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై సోషల్మీడియా ఖాతాలో ఏదైనా వ్యతిరేక పోస్టు పెడితే ఇక చట్ట పరమైన శిక్షలు తప్పవు.
ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్మీడియా వేదికల ద్వారా ఇకపై ఏదైనా పోస్ట్ చేస్తే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖల నుంచి నోటీసులు అందుకునే అవకాశం ఉంది. ఇక ఆన్లైన్ వేదికలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే యూజర్ల, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను సైతం న్యూస్ పబ్లిషర్లుగానే ఇకపై కేంద్రం చూడబోతున్నదన్నది స్పష్టం కానుంది.
ఏమైనా అభ్యంతరకర పోస్టులు పెడితే.. నేరుగా యూజర్లకే నోటీసులు పంపాలనే సమాలోచన కేంద్రం చేస్తోంది. ఈ మేరకు ఐటీ నిబంధనలతోపాటు 2021లో కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ సోమవారం కేంద్రం ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. దీనిపై ఏప్రిల్ 14వ తేదీ నాటికి అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉందని కేంద్రం స్పష్టం చేసింది.









Comments