జెన్ టెక్నాలజీస్ నుంచి మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ సిస్టమ్
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన జెన్ టెక్నాలజీస్.. తన స్వదేశీ రక్షణ సాంకేతిక పరిజ్ఞాన పోర్ట్ఫోలియోను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా దేశంలో తొలి హై-ఆల్టిట్యూడ్ మ్యాన్-పోర్టబుల్ యాంటీ-డ్రోన్ సిస్టమ్ (ఎంపీఏడీఎ్స)ను ఆవిష్కరించింది. పర్వత ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే దళాలకు రక్షణ కల్పించడానికి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి కౌంటర్-యూఏఎస్ సొల్యూషన్ ఇదని కంపెనీ పేర్కొంది. సంప్రదాయ వాహనాలపై అమర్చే వ్యవస్థలు వినియోగించడం సాధ్యంకాని భూభాగాల్లో వేగంగా మోహరించడానికి ఈ మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ వ్యవస్థను రూపొందించినట్టు తెలిపింది. అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) డిటెక్షన్, ఇంటెలిజెంట్ డేటా ఫ్యూజన్, ఓమ్ని డైరెక్షనల్ జామింగ్ సాంకేతికత ఇందులో ఉన్నట్టు పేర్కొంది. ఇది 24 గంటలూ అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పని చేస్తుందని, ఈ వ్యవస్థను సైనికులు, ఆల్ టెరైన్ వెహికిల్స్ (ఏటీవీ), అన్మ్యాన్డ్ గ్రౌండ్ వెహికిల్స్ (యూజీవీ) ద్వారా సులభంగా తీసుకెళ్లవచ్చని వివరించింది.








Comments