తల్లిదండ్రుల హత్యకేసులో నిందితురాలి ఆత్మహత్య
సంగారెడ్డి : తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి నిరాకరించారని తల్లిదండ్రులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపేసిన ఘటనలో నిందితురాలైన యువతి అదే తరహాలో మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డిలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కల సురేఖ (25) సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.. ఆమెకు గతంలో ఓ యువకుడితో ఇన్స్టాలో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అతడిని వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులైన ధశరథం, లక్ష్మీలకు సురేఖ చెప్పింది. దీనికి వారు అంగీకరించకపోగా, యువతికి పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఇది నచ్చని యువతి తన ప్రేమకు తల్లిదండ్రులను అడ్డుగా ఉన్నారని, వారిని చంపేయాలని నిర్ణయించుకుంది.
గత జనవరిలో సెలవులపై వికారాబాద్ జిల్లా బట్వారం గ్రామానికొచ్చింది. వెంట తాను పని చేస్తున్న ఆస్పత్రి నుంచి మత్తు మందు తీసుకొచ్చింది. ఒంటి నొప్పులకు మందు ఇస్తున్నానని చెప్పి.. తల్లిదండ్రులిద్దరికీ వేర్వేరుగా పెద్ద మోతాదులో మత్తు ఇంజక్షన్లు ఇచ్చింది. ఈ ఘటనలో ఇద్దరూ చనిపోయారు. తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. పోలీసుల విచారణలో ఆమే ఈ హత్య చేసినట్లు తేలింది. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. జూలై 31న బెయిల్పై బయటకొచ్చిందామె. సంగారెడ్డి శాంతినగర్లోని ఓ ప్రైవేటు వర్కింగ్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతోంది.. ఈ నెల 23న అర్ధరాత్రి సురేఖ తాను ఉంటున్న హాస్టల్లోనే మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంగారెడ్డి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సురేఖ గదిలో సూసైడ్ నోట్ లభించింది. తనకు బతకాలని ఆశలేదని లేఖలో రాసింది.









Comments