పాక్ మంత్రి ద్వారా అమెరికా సందేశం.. ఇరాన్ స్పందన ఏంటంటే..
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ టెహ్రాన్ పర్యటనపై చెలరేగిన ఊహాగానాలకు ఇరాన్ చెక్ పెట్టింది. అమెరికా అందించిన సందేశంతో నఖ్వీ ట్రెహ్రాన్ చేరుకున్నారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదని, అమెరికా నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనా లేదా సందేశం రాలేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మొహ్సిన్ నఖ్వీ కేవలం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చల కోసం టెహ్రాన్ వచ్చినట్టు ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. ఇరాన్, పాకిస్థాన్ మధ్య ఇప్పటికే కుదిరిన అవగాహనలను ముందుకు తీసుకెళ్లడమే నఖ్వీ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ముఖ్యంగా ఇరు దేశాల నాయకత్వ స్థాయిలో కుదిరిన ఒప్పందాల అమలుపై చర్చలు జరగనున్నట్లు చెప్పారు.
కాగా, అమెరికాతో భవిష్యత్తులో చర్చలు జరిపే అంశంపై ఇరాన్ ఏడు షరతులను వెల్లడించింది. ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా అమెరికాకు ఇరాన్ షరతులు వెళ్లాయి. యుద్ధానికి ముగింపు, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల, అమెరికా నౌకాదళ దిగ్బంధం తొలగింపు వంటి అంశాలు ఆ షరతుల్లో ఉన్నట్టు సమాచారం. డిమాండ్లను తిరస్కరిస్తే తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇరాన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అమెరికా నుంచి వచ్చే స్పందన కోసం టెహ్రాన్ ఎదురుచూస్తోందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.










Comments