మాది పాలు.. తేనె సంబంధం
బెంగళూరు: డీకే శివ కుమార్తో తనది పాలు, తేనె సంబంధం అని తమ నెవరూ విడదీయలేరని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఉపముఖ్యమంత్రి డీకేపై నిఘా పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ప్రతిపక్షనేత అశోక్, కేంద్రమంత్రి కుమారస్వామి ఆరోపణలపై సీఎం మండిపడ్డారు. తానెందుకు డీసీఎం ఫోన్ ట్యాప్ చేస్తానన్నారు. మేమిద్దరం బాగున్నామని, మా బంధం చెడపకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను దొంగనై ఇతరులను నమ్మడం లేదనే సామెతలా.... ఇవో అసంతృప్తి వ్యాఖ్యలన్నారు. ఆరోపణలపై మంగళవారం సీఎం ఒక ప్రకటన విడుదల చేశారు.
తనతో డీకే శివకుమార్ సంబంధం బాగుందని, వారు ఎంతగా పులుపు నింపాలన్నా సాధ్యం కాదని, మాది పాలూ, తేనెలాంటి సంబంధం అన్నారు. ఆరోపణలు చేసినవారు ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు డీసీఎం, హోం మంత్రిగా వ్యవహరించిన వారన్నారు. ఇంటెలిజెన్స్ వారి పాలనలోనూ ముఖ్యమంత్రి వద్దే ఉండేదని, ప్రస్తుత ఆరోపణలు వారి అనుభవమా అని ప్రశ్నించారు. మాది ప్రజాస్వామ్యం కల్గిన కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రధాని ఎదుట నోరు తెరిచేందుకు, కాళ్లు, చేతులు వణికేలాంటి బీజేపీ కాదని, కుటుంబ ఆధిపత్యం కల్గిన జేడీఎస్ కూడా కాదన్నారు.
మా ఎమ్మెల్యేలు ఎవరూ నాకూ లేదా డీసీఎం డీకే శివకుమార్కు అనుచరులు కాదని, అందరూ కాంగ్రెస్ వారే అన్నారు. పార్టీ క్రమశిక్షణకు అనుగుణంగా వ్యక్తిగత అభిప్రాయంతోపాటు విందుల్లో పాల్గొనే స్వాతంత్య్రం వారికి ఉందన్నారు. మా పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని నేను లేదా డీకే శివకుమార్ శిరసా వహిస్తామన్నారు. శివకుమార్ ఒక క్రమశిణ కల్గిన కాంగ్రెస్ వాది అని, తప్పుడు కేసులతో జైలుకు పంపినా భయపడింది లేదన్నారు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కాంగ్రెస్ వారికి కట్టుబడ్డారన్నారు. ఆపరేషన్ కమల, రిసార్టు రాజకీయాలు, తప్పుడు ఆరోపణలు ఎవరి కాలంలో జరిగాయనేది పరిశీలించుకోవచ్చునన్నారు. 2018లో కుమారస్వామి సీఎంగా ఉన్నప్పుడు ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానంద నాథస్వామి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ప్రస్తుత రాజకీయ మిత్రుడు విజయేంద్ర ఆరోపించారన్నారు. దర్యాప్తు చేసిన సీబీఐ కేవలం ఒక స్వామిజీది కాదని, ఏడుగురు మఠాధిపతుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్టు తెలిపిందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీఐబీ, ఐటీ, ఈడీలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎవరికి ఉన్నాయన్నారు. కుమారస్వామికి ఈ గూఢచర్య పాఠాలు తండ్రి చెప్పి ఉండవచ్చునన్నారు. దేవేగౌడను కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని చేస్తే అప్పటి పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరికి వ్యతిరేకంగా గూఢచర్యం జరిపినందుకే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుందన్నారు. కుమారస్వామి, అశోక్ కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలన్నారు.









Comments