సూర్యవంశీ మెరుపులు
హరారే: టీ20 వరల్డ్ చాంపియన్ భారత జట్టు వరుస ఓటములకు బ్రేక్ పడింది. అలాగే కెప్టెన్ శ్రేయాస్ అయ్య ర్ కూడా ఎట్టకేలకు గెలుపు రుచి చూశాడు. ముందుగా పేసర్ మయాంక్ (2/18) అంతర్జాతీయ క్రికెట్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోగా.. ఆ తర్వాత వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) బ్యాటింగ్లో తడాఖా చూపాడు. దీంతో గురువారం జింబాబ్వేతో జరిగిన మొదటి టీ20లో ఏడు వికెట్ల తేడాతో భారత్ నెగ్గింది. శ్రేయాస్ నేతృత్వంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతుల్లో ఏడు ఓటముల తర్వాత జట్టుకిదే తొలి టీ20 విజయం. ముందుగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. వెస్లీ మధెవెరె (39), తడివనషె (27 నాటౌట్), రియాన్ బర్ల్ (26) రాణించారు. మయాంక్, ప్రిన్స్లకు రెండే సి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లకు 126 రన్స్చేసి గెలిచింది. ఇషాన్ (24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35), శ్రేయాస్ (24 బంతుల్లో 3 ఫోర్లతో 28 నాటౌట్) ఆకట్టుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మయాంక్ నిలిచాడు.
వైభవ్ బాదుడు: ఇదే మైదానంలో అండర్-19 వన్డే వరల్డ్కప్ ఆడిన అనుభవం ఉండడంతో టీనేజర్ వైభవ్ ఎట్టకేలకు బ్యాట్ ఝుళిపించాడు. రెండో ఓవర్లోనే తను 6,4,6 తో 20 రన్స్ అందించాడు. మరో ఓపెనర్ అభిషేక్ (1) నిరాశపర్చాడు. అటు ఇషాన్ ఆరో ఓవర్లో మూడు ఫోర్లు సాధించడంతో.. పవర్ప్లేలో జట్టు 66/1 స్కోరుతో నిలిచింది. ఏడో ఓవర్లో 18 బంతుల్లో తన తొలి హాఫ్ సెంచరీ సాధించిన వైభవ్ తర్వాతి బంతికే క్యాచ్ అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్కు 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఇషాన్-శ్రేయా్స నిలకడగా ఆడారు. ఇషాన్ వెనుదిరిగిన కాసేపటికే భారత్ మరో 40 బంతులుండగానే మ్యాచ్ను ముగించింది.
చెలరేగిన మయాంక్: టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేను మయాంక్, ప్రిన్స్ వణికించారు. అయితే అరంగేట్ర పేసర్ అశోక్ శర్మ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా 2024 అక్టోబరు తర్వాత తొలి మ్యాచ్ ఆడిన మయాంక్ పేస్ను ఎదుర్కోవడంలో బ్యాటర్లు కష్టపడ్డారు. అయితే 32/4 స్కోరుతో తడబడిన జట్టును వెస్లీ, రియాన్, తడివనషె ఆదుకున్నారు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ బ్రయాన్ (0) వికెట్ను మయాంక్ పడగొట్టాడు. తర్వాత మరో ఓపెనర్ బెన్ (10)ను ప్రిన్స్ అవుట్ చేయగా, ఐదో ఓవర్లో మైర్స్ వెనుదిరిగాడు. కెప్టెన్ రజా (4) కూడా విఫలమైన వేళ.. వెస్లీ-బర్ల్ జోడీ ఐదో వికెట్కు 32 పరుగులు జోడించింది. ఆ తర్వాత తడివనషెతో కలిసి వెస్లీ ఆరో వికెట్కు 58 పరుగులు జత చేశాడు.
చరిత్రలో అతిపిన్న వయస్కుడిగా..
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోనూ తనదైన ముద్ర వేశాడు. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో సహజశైలిలో చెలరేగిన తను అత్యంత చిన్నవయస్సులోనే హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్గా నిలిచాడు. కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయస్సులోనే వైభవ్ ఈ ఫీట్ నెలకొల్పడం విశేషం. అంతకుముందు నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్ల (15 ఏళ్ల 340) పేరిట ఈ రికార్డు ఉండేది.










Comments