ట్రాలీ లారీ- కారు ఢీ..నలుగురి దుర్మరణం
భైంసా : జాతీయ రహదారి 61పై భైంసా సుద్దవాగు వంతెన మీద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన ట్రాలీ లారీ- కారు ఢీ కొనడంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్లో చికిత్స పొందుతున్న తమ గ్రామస్థుడిని పరామర్శించేందుకు కుభీర్ మండలంలోని కుప్టి గ్రామ సర్పంచ్ గంగాధర్ సహా ఐదుగురు సోమవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. సోమవారం రాత్రి తిరిగి స్వగ్రామానికి పయనమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు భైంసాకు దగ్గరలోని సుద్దవాగు వంతెన మీదకు ప్రవేశించింది. అదే సమయంలో నిర్మల్ మీదుగా గుజరాత్ వెళుతున్న ట్రాలీలారీ వంతెన మీదకు వచ్చింది. ఎదురెదురుగా వచ్చిన ఈ రెండు వాహనాలూ ఢీకొట్టుకున్నాయి. ట్రాలీ లారీపైనున్న భారీ పరికరానికి తగిలిన కారు కుడి వైపు భాగం నుజ్జునుజ్జయిపోయింది. దీంతో కారులో ఉన్న డ్రైవర్ వికాస్ బొప్ప (23), భోజరామ్ పాటిల్ (45), కొడిమెల పెద్ద రాజన్న(60), బోయిడి బాబన్న(65)ఘటన స్థలిలోనే దుర్మరణం పాలయ్యారు. గ్రామ సర్పంచ్ గంగాధర్(37) తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. క్షతగాత్రులను భైంసాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.










Comments