తెలంగాణ విద్యుత్ రంగంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : తెలంగాణ విద్యుత్ రంగం ఆర్థికంగా సంక్షోభంలో ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గత, ప్రస్తుత ప్రభుత్వాల అప్పులు తడిసి మోపెడయ్యాయని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు విద్యుత్ ఉత్పత్తి విషయంలో అన్ని రకాలుగా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల.. అప్పుల బాటలో, నష్టాల ఊబిలో పేరుకుపోయాయని.. వేలకోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోయలేక నడ్డి విరుగుతోందని అన్నారు. విద్యుత్ సంస్థలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేసిందని.. రూ.30 వేల కోట్లకు పైగా అప్పు ఉందని చెప్పారని కేంద్రమంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కంపెనీకి 47 వేల కోట్ల రూపాయలు అప్పు ఉందన్నారు. విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోందని.. విద్యుత్ సంస్థల అప్పుల పరిస్థితి కూడా పెరుగుతోందని తెలిపారు. ఒకపూట వర్షాలు, గాలులు వస్తే హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోతుందన్నారు. కంపెనీలను ఆహ్వానిస్తున్న తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యుత్ లేకపోతే కంపెనీలు రావన్నారు. పాత బకాయిల విషయంలోనూ ఎటువంటి ఆలోచన చెయ్యడం లేదని విమర్శించారు. నిధులు లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.
గ్లోబల్ హబ్గా మారాలంటే విద్యుత్ చాలా కీలకమని చెప్పుకొచ్చారు. కొత్త డిస్కంల ఏర్పాటుపై కాకుండా.. విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలన్నారు. మనిషి మనుగడ, వ్యవస్థ మనుగడకు విద్యుత్ అత్యంత కీలకమని చెప్పుకొచ్చారు. విద్యుత్ ప్రాథమిక అవసరంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. 74 శాతం విద్యుత్ థర్మల్తోనే జరుగుతోందని అన్నారు. గతంలో ఏపీ, తెలంగాణలో విద్యుత్ కోతలు ఉండేవని గుర్తుచేశారు. మోదీ పీఎం కాకముందే విద్యుత్ కోసం ఆందోళనలు జరిగాయన్నారు. ఇపుడు 24/7 విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. ఇప్పుడు వన్ నేషన్ - వన్ గ్రిడ్తో అనుసంధానం జరిగిందని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ కేబుల్స్ వ్యవస్థ బలోపేతం కోసం కొత్త టెక్నాలజీ అందించామన్నారు. కేంద్రం తెలంగాణాకు అనేక రకాలుగా సహకారం అందించిందని తెలిపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల పవర్ జనరేషన్ చెయ్యాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి కంపెనీ డీఎమ్ఎఫ్ కింద నిధులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని కేంద్రమంత్రిపేర్కొన్నారు.
ఎమ్మెల్యేల అనర్హత అంశంపై..
ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం దురదృష్టకరమని కేంద్రమంత్రి అన్నారు. ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పును పునరాలోచన చేయాలని కోరారు. పార్టీలు మారినట్టు ఎమ్మెల్యేలు, పత్రికలు ప్రకటించాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారన్నారు. రాజ్యాంగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గౌరవం లేదని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తోందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గతం కంటే బీజేపీకి చాలా బలం పెరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.









Comments