అల్వాల్లో డ్రగ్ స్కామ్ కలకలం.. రూ. 70 లక్షల ముడిసరకు సీజ్
మేడ్చల్ : జిల్లాలోని అల్వాల్లో భారీ డ్రగ్ స్కామ్ వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపింది. ఔషధాల తయారీలో వాడే ముడి పదార్థాలు అక్రమ లేబులింగ్ దందా సాగుతుందనే పక్కా సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు రంగంలోకి దిగారు. అల్వాల్ పరిధిలోని డీకే ఫార్మాస్యూటికల్స్ సంస్థపై మెరుపు దాడులు నిర్వహించారు. సుమారు రూ.70.56 లక్షల విలువైన 240 కేజీల ఫార్మా ముడి పదార్థాలను సీజ్ చేశారు. ఈ దందాలో నిందితులు అసలు లేబుళ్లను తొలగించి, వాటి స్థానంలో నకిలీ లేబుళ్లను అంటిస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. నకిలీ గుర్తింపు కార్డులు, తప్పుడు చిరునామాలతో ఇంతటి భారీ దందాకు తెరలేపడం ఫార్మా రంగంలో సంచలనంగా మారింది. నిబంధనలను ఉల్లంఘించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ సంస్థపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులు ఎవరనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.









Comments