• Jun 05, 2026
  • NPN Log

    విశాఖపట్నం : ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’   ఫేమ్ డ్యాన్స్ మాస్టర్‌ పండుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పండు మాస్టర్ కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    అసలేం జరిగిందంటే..?

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పండు మాస్టర్ తన బృందంతో కలిసి తగరపువలసలో జరిగిన ఒక జాతర కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుక ముగిసిన అనంతరం వారు కారులో తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఆనందపురం పరిధిలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, కారులో ఉన్న ఒకరికి వాంతులయ్యాయి. దీంతో కారును రోడ్డు పక్కన ఆపారు. ఆ సమయంలో పండు మాస్టర్ కూడా కారు దిగారు. అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన ఒక కోళ్ల వ్యాన్, రోడ్డు పక్కన ఆగి ఉన్న పండు మాస్టర్ కారును, ఆయనను బలంగా ఢీకొట్టింది.

    కాళ్లకు తీవ్ర గాయాలు.. కారు ధ్వంసం..

    కోళ్ల వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో పండు మాస్టర్ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్ ఢీకొట్టిన వేగానికి పండు మాస్టర్ ప్రయాణిస్తున్న కారుతో పాటు, దాని ముందు ఆగి ఉన్న మరో బొలెరో వాహనం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న పండు మాస్టర్‌ను స్థానికులు, సహచరులు కలిసి చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement