వైకుంఠద్వార దర్శనాల్లో తొలి మూడు రోజుల్లో.. మూడు ప్రాంతాల నుంచి స్లాటెడ్ భక్తులకు అనుమతి
తిరుమల : వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే తొలి మూడు రోజులకు సంబంధించి మూడు ప్రాంతాల నుంచి భక్తులను అనుమతించేలా టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. భక్తుల మధ్య తోపులాటలు, గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేయించేలా సిద్ధమవుతోంది. ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనాలు పదిరోజుల పాటు జరుగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 30వ తేదీ ఏకాదశి, 31 ద్వాదశి, జనవరి 1వ తేదీలకు సంబంఽధించి 1.76 లక్షల మందికి ఈ-డిప్ విధానంలో ముందస్తుగానే స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లను కేటాయించింది. తొలిరోజు ఐదు గంటలు వీఐపీ బ్రేక్ దర్శనాలకు మినహాయించి మిగిలిన సమయం మొత్తాన్ని స్లాటెడ్ దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం చేయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రోజుకు 14 స్లాట్లలో టోకెన్లు జారీ చేయగా, వీరికి ప్రవేశ మార్గాలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఉదయం స్లాట్ల వారిని కృష్ణతేజ సర్కిల్ నుంచి, మధ్యాహ్నం స్లాట్ల వారిని ఏటీజీహెచ్ నుంచి, రాత్రి స్లాట్ల వారిని శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ మూడురోజుల పాటు టోకెన్ లేని భక్తులకు ఎలాంటి దర్శనాలూ ఉండవని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక, జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఎలాంటి టోకెన్లు, టికెట్లు లేకపోయినప్పటికీ వైకుంఠం క్యూకాంప్లెక్స్ 2 నుంచి నుంచి అనుమతించి దర్శనాలు చేయిస్తామని టీటీడీ ప్రకటించింది. ఈనేపథ్యంలో 2, 3 తేదీల్లో రద్దీ అధికంగా ఉండే అవకాశముందని భావిస్తున్న అధికారులు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు.










Comments