• Apr 30, 2026
  • NPN Log

    ఎండాకాలం వచ్చేసింది. మండే ఎండలతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇలాంటి సందర్భాల్లో శరీరంలో నీటి శాతం పడిపోకుండా చెరకు రసం, నిమ్మరసం, కర్బూజా వంటి జ్యాస్‌లు తరచుగా తీసుకోవాలి. దీనితోపాటు భోజనంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అందుకు సరైన వంటకాలను ఎంచుకోవాలి. అలాంటి వంటకాల్లో ఒకటి వెజిటెబుల్ మజ్జిగ పులుసు. ఎండాకాలం ఇదో బెస్ట్ చాయిస్ అనే చెప్పాలి. పైగా ఆంధ్ర వంటకాల్లో దీనికి ఓ అద్భుతమైన, రుచికరమైన వంటకంగా పేరుంది. ఇది ప్రత్యేకమైన రుచితోపాటు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. వేసవికాలంలో శరీరానికి చల్లదనం ఇచ్చే ఈ పులుసు, జీర్ణక్రియనూ మెరుగుపరుస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

    కావాల్సిన పదార్థాలు..

    రెండు కప్పుల మజ్జిగ, బెండకాయ, సొరకాయ లేదా దొండకాయ వంటి కూరగాయల ముక్కలు ఓ కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు కప్పులు, నాలుగు పచ్చిమిర్చి, టీస్పూన్ అల్లం పేస్ట్, హాఫ్ టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు కొబ్బరి తురుము, హాఫ్ టీస్పూన్ శెనగపప్పు, హాఫ్ టీస్పూన్ జీలకర్ర, హాఫ్ టీస్పూన్ ఆవాలు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, సరిపడా నూనె.

    తయారీ విధానం..

    ముందుగా కూరగాయలను బాగా శుభ్రంగా కడగాలి. చిన్నచిన్న ముక్కలుగా కోసి వాటిలో పసుపు, ఉప్పు వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి కొంచెం మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ తయారు చేసుకోవాలి. కొబ్బరి తురుము, శెనగపప్పు, జీలకర్రలను కలిపి కొన్ని నీళ్లు జత చేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ రూపంలో తయారు చేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్టును మజ్జిగలో వేసి బాగా కలపాలి. అనంతరం ఉడికించిన కూరగాయల్లో ఈ మజ్జిగ మిశ్రమాన్ని పోయాలి.

    మధ్యస్థ మంటపై దాన్ని కాసేపు వేడి చేయాలి. మరిగే వరకూ ఉంచకూడదు.. కేవలం వేడి అయ్యేంత వరకు మాత్రమే ఉంచాలి. మరో పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు చేయాలి. ఈ తాలింపును వెంటనే పులుసులో పోయాలి. చివరిగా కొద్దిగా నెయ్యి జోడిస్తే సువాసన అద్భుతంగా ఉంటుంది. దీంతో వెజిటెబుల్ మజ్జిగ పులుసు సిద్ధమైనట్లే.. ఇది అన్నం సహా రోటీలు, జొన్న రొట్టెల్లో భలే రుచిగా ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).