విజయనగరం జిల్లాలో కారు బీభత్సం.. నలుగురి మృతి
విజయనగరం : విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మితిమీరిన వేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విజయనగరం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..?
విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వేగంగా వెళ్తున్న ఒక కారు, పూసపాటిరేగ మండలం పేరాపురం జంక్షన్ వద్దకు చేరుకోగానే అదుపు తప్పింది. ఆ సమయంలో పేరాపురం దగ్గర రోడ్డు దాటుతున్న ఇరువురిని కారు ఢీ కొట్టింది. అనంతరం లారీని ఢీ కొట్టిన దుర్ఘటనలో కారు డ్రైవరు, మరొకరు మృతిచెందారు.
పోలీసుల చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా ఉన్న మృతదేహాలను సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, ముఖ్యంగా కూడళ్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాదంలో ఒకరు మృతి
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రైవేట్ బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా , బస్సులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతుడు పోలవరం మండలం పాలరేవుకు చెందిన గణేష్గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మార్కాపురం జిల్లాలో...
మార్కాపురం జిల్లాలోని కంభం మండలం జంగంగుంట్ల వద్ద బైకును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.









Comments