ఆంధ్రా అరటి ఇక యూరప్కు: వికసిత్ భారత్ సదస్సులో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
ఆంధ్రా అరటి ఇక యూరప్కు: వికసిత్ భారత్ సదస్సులో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
న్యూఢిల్లీ (ఎన్ పి ఎన్ న్యూస్):
రాష్ట్రంలో పండే వ్యవసాయ, తోటబడి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం ద్వారా వాటి విలువను గణనీయంగా పెంచడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన "వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి ఆర్థిక వనరుల సమీకరణ" సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుండి అరటి పండ్లు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, త్వరలోనే వీటిని యూరప్ మార్కెట్లకు కూడా పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు కేవలం రుణాలు పెంచడం మాత్రమే కాకుండా, పంట విలువ పెంపుదల (Value Addition) పై దృష్టి పెడితేనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సదస్సులో మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించిన ముఖ్య విషయాలు:
- ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్: రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న వ్యవసాయ విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలో త్వరలోనే 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్'ను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి దీనిని ప్రారంభిస్తారు.
- ప్రకృతి వ్యవసాయం విస్తరణ: రాష్ట్రంలో దాదాపు 18 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడం ద్వారా రైతులకు, వినియోగదారులకు మేలు చేకూరుస్తున్నట్లు తెలిపారు.
- సాంకేతికతతో ఈ-క్రాప్ బుకింగ్: ఏ ప్రాంతంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో పండుతోందో తెలుసుకునేందుకు ఈ-క్రాప్ బుకింగ్ డేటాను శాటిలైట్ మ్యాపింగ్తో అనుసంధానించే ప్రయత్నం జరుగుతోంది.
- 247 హార్టికల్చర్ క్లస్టర్లు: వ్యవసాయ, సాగునీటి మంత్రిత్వ శాఖలను సమీకృతం చేస్తూ రాష్ట్రంలో 247 క్లస్టర్లను గుర్తించామని, వీటిలో ముఖ్యంగా ఉద్యానవన (హార్టికల్చర్) పంటలకు ప్రాధాన్యతనిచ్చి సాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'గ్లోబల్ హార్టికల్చర్' కార్యక్రమాన్ని ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.









Comments