ఆర్ఎస్ఎస్ ఎజెండాను ప్రభుత్వం అమలు చేస్తోంది... ఎస్ఐఆర్పై చర్చలో రాహుల్
న్యూఢిల్లీ: రాజ్యాంగ వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎజెండా అని, ఆ ఎజండానే ప్రభుత్వం అమలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై మంగళవారం నాడు లోక్సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ వాదులకు సమానత్వంపై నమ్మకం లేదని, అన్ని వ్యవస్థలపైనా ఆధిపత్యం చూపుతున్నారని విమర్శించారు. ఎన్నికల వ్యవస్థను సైతం ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లో ఉంచుకుందని ఆరోపించారు. ఇప్పటికే దేశంలోని విద్యావ్యవస్థను మార్చేశారని, దేశంలోని వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకే ఈసీని వాడుకుంటున్నారని, క్షేత్ర స్థాయిలో ఎన్నికల సంస్కరణలు అమలు కావడం లేదని రాహుల్ ఆరోపించారు. ఈసీ నియామకంలో మోదీ, అమిత్షాకు ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్లకు మోదీ, అమిత్షా బహుమతులిస్తున్నారని, సీబీఐ, ఈడీలను ప్రభుత్వం తన గుప్పిట్లో ఉంచుకుందని ఆరోపణలు గుప్పించారు. కేంద్రం, ఎన్నికల సంఘం కుమ్మకయ్యాయని, తాను నిజాలు మాట్లాడుతుంటే బీజేపీ జీర్ణించుకోలేక పోతోందని అన్నారు. తాను ఏదీ తప్పుగా మాట్లాడలేదని, పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నానని చెప్పారు.
ఎన్నికల సంస్కరణలపై కేంద్రం గొప్పలు చెప్పుకుంటోందని రాహుల్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్, హరియాణాలో పలు చోట్ల 'ఓట్ చోరీ' జరిగిందన్నారు. ఎన్నికల సీసీ ఫుటేజ్ను ధ్వంసం చేశారని, ఫేక్ ఓట్లపై ఈసీ క్లారిటీ ఇవ్వలేదని చెప్పారు. తాను అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ ఈసీ సమాధానం ఇవ్వలేదని అన్నారు.








Comments