జనవరి నెలాఖరులో జేఈఈ మెయిన్
న్యూఢిల్లీ : జాతీయస్థాయి ప్రవేశపరీక్షలకు సంబంధించిన తేదీలను ‘జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ’ (ఎన్టీఏ) గురువారం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి నెల వరకూ మొత్తం 14 ప్రవేశపరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇది ప్రస్తుతానికి తాత్కాలిక షెడ్యూల్ మాత్రమేనని, నిర్వహణ, విద్యాసంబంధమైన, క్షేత్రస్థాయి, అనుకోని పరిస్థితుల వల్ల తేదీల్లో మార్పులు ఉండవచ్చని సూచించింది. ఈ తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం, 2027 జనవరి 22-24 నుంచి జనవరి 28-30 తేదీల మధ్య (గరిష్ఠంగా 2027 జనవరి 31వ తేదీ వరకూ) జేఈఈ మెయిన్ ఫస్ట్ ఎడిషన్ను నిర్వహిస్తారు. 2026 డిసెంబరు 14-19 తేదీల మధ్య (గరిష్ఠంగా డిసెంబరు 20-21) యూజీసీ-నెట్, 2026 డిసెంబరు 20-21 మధ్య జాయింట్ సీఎ్సఐఆర్ యూజీసీ-నెట్, 2027 ఫిబ్రవరి 7న కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్, 2027 మార్చి 1-5, మార్చి 8, మార్చి 12-20, మార్చి 24-25 (గరిష్ఠంగా మార్చి 30-31) తేదీల్లో కామన్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ టెస్ట్ను నిర్వహించనున్నారు. వీటితోపాటు నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ టెక్నికల్ టీచర్స్ ట్రెయినింగ్ పార్ట్ 1, పార్ట్ 2, ఆర్మీ క్యాడెట్స్ కాలేజ్ ఎగ్జామ్, నిఫ్ట్ ఎంట్రెన్స్, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఎగ్జామ్, స్వయం ఎగ్జామ్, ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ పరీక్షలను కూడా నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడించింది.










Comments