టీటీడీ ఉద్యోగి ఇంటిలో భారీ చోరీ
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగి ఇంటిలో భారీ చోరీ జరిగింది. దాదాపు 320 గ్రాముల బంగారంతోపాటు రూ.10 లక్షల నగదును దొంగలు అపహరించారు. దీంతో బాధితుడు తిరుపతి గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ చిన్న గోవిందు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమల గ్రామీణ ప్రాంతం పెరుమూలపల్లి పంచాయతీ పరిధిలో మురళీ మోహన్ నివాసిస్తున్నారు. ఆయన తిరుచానూరు టీటీడీ కార్యాలయంలో డఫేదారుగా విధులు నిర్వహిస్తున్నారు.
ఇటీవల ఆయన కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. వివాహ ఏర్పాట్ల కోసం బుధవారం మురళీ మోహన్ భార్య, కుమార్తె బెంగుళూరు వెళ్లారు. ఇంటికి తాళం వేసి మురళి మోహన్ తిరుచానూరులోని టీటీడీ కార్యాలయానికి వెళ్లారు. గురువారం ఉదయం మురళీ మోహన్ భార్య, కుమార్తె ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తలుపు తాళం పగిలి ఉండడంతోపాటు.. తలుపులు సైతం తీసి ఉన్నాయి. దాంతో మురళి మోహన్కు అతడి భార్య, కుమార్తె సమాచారం అందించారు. ఆయన వెంటనే తిరుపతి గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మురళి మోహన్ నివాస పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.









Comments