నీట్ EWS కోటా ఆదాయ పరిమితిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఈడబ్ల్యూఎస్ నిబంధనలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. పాండే కమిటీ సిఫార్సులు, అర్హతల మార్గదర్శకాలపై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా నీట్ ఈడబ్ల్యూఎస్ కోటా ఆదాయ పరిమితిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ఆలిండియా కోటాలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అర్హతకు నిర్దేశించిన రూ. 8 లక్షల వార్షిక కుటుంబ ఆదాయ పరిమితి ప్రాథమికంగా సమంజసంగానే ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘రూ. 8 లక్షల ఆదాయ పరిమితి సహేతుకంగానే కనిపిస్తోంది. ఏ ప్రాతిపదికన మీరు దీన్ని సవాలు చేస్తున్నారు?’ అని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. పాండే కమిటీ సిఫార్సు చేసిన మార్పులను కేంద్ర ప్రభుత్వం ఇంకా పూర్తిగా అమలు చేయలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది తన్వీ దూబే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా దాఖలైన ఇలాంటి పిటిషన్లన్నింటినీ క్రోడీకరించి, వాటిలోని ప్రధానాంశాలతో ఒక సమగ్రమైన చార్ట్ తయారు చేయాలని ధర్మాసనం తన్వీ దూబేను ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది.









Comments