హెచ్-1బీ వీసాలకు మూడేళ్ల విరామం!
వాషింగ్టన్ : అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణుల ఆశలపై నీళ్లు చల్లేలా కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త హెచ్-1బీ వీసాల జారీ కార్యక్రమాన్ని మూడేళ్ల పాటు నిలిపివేయడంతో పాటు ట్రంప్ యంత్రాంగం విధించిన లక్ష డాలర్ల ఫీజును చట్టబద్ధం చేయాలని కోరుతూ మోంటానాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ అమెరికా సెనేట్లో బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా కార్మిక హక్కులకు భంగం కలిగించేలా లేదా వారి అవకాశాలను దెబ్బతీసే వీసాలను జారీ చేయకూడదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా షీహీ మాట్లాడుతూ.. అన్ని అర్హతలు ఉండి, కష్టపడి పనిచేసే అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు లభ్యమయ్యే విదేశీ కార్మికులను నియమించడం సరికాదని పేర్కొన్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు యూఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్ల రుసుము విధించాలన్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించడానికి నిరాకరించింది. ఈ ఫీజును పునరుద్ధరించాలన్న ట్రంప్ ప్రభుత్వ విజ్ఞప్తిని బోస్టన్లోని 1వ సర్క్యూట్ అప్పీల్స్ కోర్ట్లోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి దాదాపు 20 డెమొక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరళ్లు కోర్టును ఆశ్రయించారు.










Comments